LOCAL WEATHER

12, మే 2014, సోమవారం

విభజనకి తొందరేమొచ్చింది..???


ఆంధ్రప్రదేశ్ నుండి 
తెలంగాణా పేరుతో కొత్త రాష్ట్రం విడిపోవటాన్ని
 పార్లమెంటులోనూ-రాష్ట్రపతి దగ్గరా ఖచ్చితం చేసినప్పుడు...
దీనిని క్రమ పద్ధతిలోనే చెయ్యవచ్చును కదా... 
అనవసర హడావిడిని... అలవిగాని వాళ్ళు చేత చేయించి, 
తరవాతి రోజుల్లో 
ప్రజల మధ్య దశాబ్దాలబాటూ చిచ్చుపెట్టటం దేనికి...??? 
మాములుగా ఏ కొద్దిపాటి ఆస్తి ఉన్న అన్నదమ్ములు కూడా, 
దగ్గర ఉండి తమ ఆస్తులని పంపకం చేసుకుంటారు. 
అన్నదమ్ములలో ఏ ఒక్కరు అక్కడ లేకపోయినా 
ఆస్తుల పంపిణీని చెయ్యరు. 
దీని వల్లన ఏదైనా అభిప్రాయ భేదం వచ్చిందంటే 
అప్పటికప్పుడే సర్దుబాటు చేసుకోటానికి వీలుంటుంది. 
తరవాత రోజుల్లో "నేను లేనప్పుడు జరిగిపోయింది... 
నాకు అన్యాయం జరిగింది" 
అని రాద్ధాంతం చేసే అవకాశం ఏ ఒక్కరికీ ఉండదు...

అలాగే ఇంత పేద్ద రాష్ట్రాన్ని విభజించటం జరుగుతున్నప్పుడు; సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు లాంటి వారు లేకుండా... అంటే పరోక్షంగా ప్రజల భాగసామ్యం లేకుండా.... కేవలం జీతాల కోసం పనిచేసే ఉద్యోగులు  మన ప్రాంతం గురించి తెలియని అధికారి పర్యవేక్షణలో ఆస్తుల పంపిణీని చేస్తే అది న్యాయంగా జరుగుతుందా...?? తరవాతి రోజుల్లో అనేక వివాదాలని రేపి ప్రజల మధ్యలో చిచ్చు రేపకుండా ఉంటుందా...??? ఎందుకంటే ఈ ఉద్యమమే సెంటిమెంటు మీద ఆధారపడినది...మరి దానికి సంబంధించినవారు ఒక్కరు కూడా అక్కడ లేకుండా విభజన చెయ్యటం సమంజసమా...??? ఎంతో ఆస్తిగల అన్నదమ్ములు...విడిపోయి అన్నదమ్ములలాగా కలిసి ఉందామన్న వారు, ఆస్తుల పంపకం జరిగేటప్పుడు బాధ్యతగా ఉండవలసిన అవసరం ఉన్నది కదా.... కానీ, ఆ బాధ్యత కనపడటం లేదు.

విభజనలొ రాజకీయ నాయకుల ప్రమేయం ఏ మాత్రం లేనట్లు ఎవరిదారిన వారుంటే... ఇదేదో బ్యూరోక్రాటిక్ దేశంలాగా ఉద్యోగులు తమ ఇష్టారాజ్యంగా  ఇరు రాష్ట్రాల ఆస్తులనీ పంచుతున్నారు. నాయకులు ఎన్నికలు వస్తున్నాయి అని అనగానే ఎంతో ఉత్తేజంగా, నడవలేని ముసలి నాయకులు కూడా పరిగెడుతూ పాల్గొన్నవారు, విభజన కర్యక్రమంలో మడుకూ పాల్గొనటం లేదు. అదేదో ఉద్యోగుల విషయం అన్నట్లుగా మిన్నుకుండిపొయ్యారు.    

ఎన్నికలు ఇప్పుడోచ్చేవే కాకుండా... రాబోయ్యే 2019 న్నికల ప్రణాలికలని కూడా తయారు చేసుకునేంత దూర దృష్టికల మన రాజకీయ నాయకులు... రాష్ట్ర విభజన సందర్భంగా ఆస్తుల పంపకం జరుగుతున్నప్పుడు...రాజధానిలో కూర్చుని పరిశీలించాలి.  కాని, వీరికి ఆ భాధ్యత ఉన్నట్లు కనపడటం లేదు. "ఆ... ఎన్నికల తరవాత ఎవడు వస్తోడో మనకెందుకొచ్చిన గొడవ" అన్నట్లుగానే ఉన్నారు కాని... ప్రజల ఆస్తుల పంపిణీ జరుగుతుంటే అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.

ఈ విషయంలో తెలంగాణా నాయకులే కొద్దిగా నయమనిపిస్తున్నారు. అయితే వారు కూడా ఫాం హౌసులకి పరిమితం కావటమో లేక వారికి తాట తీస్తాం వీరికి నాలిక కోస్తాం అనే మాటలతోనే కాలం వెళ్ళదీస్తున్నారు. కేవలం ఉద్యోగుల విషయం తప్ప మరే దాని మీద ప్రకటనలు చెయ్యటం లేదు.

ఇక ఆంధ్రప్రదేశ్ నాయకులకైతే ప్రజలంటే ఎన్నికలుగానే కనిపిస్తోంది కానీ బాధ్య్తగా అని అనిపించటం లేదు...ఎన్నికల రణరంగలో పాల్గొన్న వీరు... ఎన్నికలు అయిపోగానే రాజధానిలో ఒక కమిటీ క్రింద ఏర్పడి రాష్ట్రాల ఆస్తుల పంపిణీలో భాగం పంచుకోవలసిందిపోయి... ఎవరిదారిన వారు హాలిడే రిసార్టులకీ...ఫాం హౌసులకీ వెళ్ళిపోయ్యారు. రేపు ఈ నాయకులే వచ్చి ఉద్యోగులు చేసిన విభజన పాపాన్ని రెచ్చగొట్టి ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సయోధ్యలేకుండా చేస్తారు...అదేదో ఇప్పుడే అన్ని పక్షాలు కలిసి కూర్చుంటే తరవాతి కాలంలో అనవసర వివాదాలుండవు కదా...!!!


ప్రజాసామ్యం...???

ప్రజాసామ్యంలో, ప్రజల ఆస్తులని పంచటానికి ఉద్యోగులు ఎవరు...? పరాయి రాష్ట్రం నుండి వచ్చిన అధికారులు ఎవరు...??? "దీని వలన కాగితాల మీద లెక్కలు బాగానే కుదరొచ్చునేమో కానీ, నేల మీద లెక్కలు గొడవలకి దారి తీస్తాయి"...ఉదాహరణకి అనేక విషయాలని జనాభ ప్రతిపాదికగా తీసుకుంటూ... కరెంటు పంపిణీని వాడకం[వినియోగం]ప్రతిపాదికని తీసుకోవటం చూస్తే ఉద్యోగుల అతి తెలివితేటలు బయటపడుతున్నాయి. అంటే, ఎవరి దగ్గరైనా... వాడని డబ్బుని ఇతరులకి పంచి వెయ్యచ్చునా... మరి అసలు వ్యక్తికి అవసరం పడితే... సీమాధ్రలో వినియోగం లేదని కరెంటుని తగ్గిస్తే... అసలే పరిశ్రమలు తక్కువ. మరి కొత్తగా పరిశ్రమలు వస్తే ఏమి చెయ్యాలి...???

అలాగే, కేవలం 10 యేళ్ళ రాజధాని అంటున్నారు.  మరి హైదరాబాదులోని అనేక భవనాలని పంచటం దేనికి... కొన్నిటిని విరగ్గోసి కట్టిస్తో అనవసర ఖర్చు దేనికి... అదేదో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా రాబొయ్యే రాజధానిలోనే ఖర్చు పెట్టవచ్చును కదా.... ఈ లోగా కలిసి కాపురం చేస్తే, ఇంతలో కొంపలేమి ముణిగిపోవు కదా...ఇది విడిపోవటం రాష్ట్రంగానే కాని... దేశంగా కాదు కదా... ఇందులో కూడా ఉద్యోగుల-అధికారుల కాగితం తెలివితేటలు కనపడుతున్నాయి.

అసలే ఈ ఉద్యోగులు వాళ్ళలో వాళ్ళకి సయోధ్య లేక, 
ఎవరు ఎక్కడికి పోవాలో తెలియక ఆందోళనలు చేస్తూ...
ఆందోళనగా ఉన్నప్పుడు, 
వారు ఇంత పెద్ద రాష్ట్రం ఆస్తులని 
ఎలా ప్రశాంతంగా చక్కగా లెక్కించి విభజింపగలరు..? 
ఆ విభజనలో 
వారి వారి లాభ నష్టాలని కూడా పరిగణలోనికి తీసుకుంటే... 
అప్పుడు ఆయా పరిధిలో ఉన్న ప్రజలకి 
తీరని నష్టం కలిగించినట్లే కదా... 
అంటే ఆస్తుల పంపిణీ చేస్తున్నప్పుడు 
ఆయా ఉద్యోగులకి ఏది లాభసాటిగా ఉంటుందో
[తమ 5 లేక 10 సంవత్సరాల సర్వీసు కోసం]
అలా పంపిణీ చేసే ప్రలోభం వారిలో ఉన్నప్పుడు... 
వారి చేతే లెక్కలు తీయించటం ప్రమాదకరం కాదా...??? 
తొందరపాటు విభజన విభేధాలకి మూలం అవుతుంది.

దీనంతటికీ మూలం, 
రాజధానిని చూపించకుండా విభజించటమే... 
ఇది బాధ్యతా రహితంగా జరిగింది... 
దీని గురించి ఇది వరలో ఇదే బ్లాగులో సూచించటం జరిగింది.
సామాన్య ప్రజలకే తెలుస్తున్నాప్పుడు... 
వేలు లక్షలు జీతాలు తీసుకొనే ఉద్యోగులకీ తెలియదా...??? 
వంశపారంపర్యంగా ప్ప్రజాసేవ చేస్తున్నామని 
చెప్పుకునే రాజకీయ ప్రముఖలకి తెలియదా
 అని అనటం కూడా జరిగింది... 
అయితే,  
ప్రజల గోడు అరణ్యరోదనే అయ్యిందే కానీ... 
 అటు రాజకీయనాయకులకి గానీ
ఇటు ఉద్యోగులకి కానీ...
బుద్ధి వికశించినట్లు కనపడలేదు....

 వేలల్లో నాయకులకి 
ఫ్రెష్‌గా వచ్చిన ఎన్నికలు ముఖ్యంకాగా...
లక్షలలో ఉన్న ఉద్యోగులకి 
తమ సర్వీసు...
పెన్షనే పరమావధి అయ్యిందే కానీ, 
కోట్లలో ఉన్న ప్రజల గోడు 
ఎవరికీ పట్టటంలేదు. 



కాబట్టి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని...
ముందరగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్ణయించి 
సాధ్యమైనంత తొందరగా 
అంటే 10 సంవత్సరాలకంటే ముందరే 
దానిలోనికి మారేట్లుగా 
ప్రణాలికని తయారు చెయ్యాలి.
అటు తమ రాజకీయ భవిష్యత్తు అని 
రాజకీయ నాయకులు స్వార్ధంగా ఆలోచించ కుండా...
ఇటు ఉద్యోగులు తమ 5, 10 సంవత్సరాల సర్వీసులు గురించి కాకుండా... 
ప్రజలకి శాశ్వతంగా మిగిలిపోయ్యే విషయాలపట్ల శ్రద్ధ వహిస్తే మంచిది. 
లేకపోతే విడిపోయి అన్నదమ్ములుగా ఉందాము అన్నమాట అటుంచి...
కనీసం ఇరుగు పొరుగు వారిలా కూడా ప్రజలు ఉండక, 
రెండు శత్రు దేశాల్లా నిత్యం కొట్టుకునే పరిస్తితి వస్తుంది.... 
నాయకులారా...సామాజిక సేవకులారా
 ఇకనైనా కళ్ళు తెరిచి విభజన ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గోనండి... 

ఇది అయిదేళ్ళకొకసారి వచ్చే 

ఎన్నికలకన్నా ముఖ్యమైనది... 
ఎన్నికలలో తప్పు నిర్ణయం తీసుకుంటే 
మరో అయిదేళ్ళలో మార్చుకోవచ్చును... 
కానీ,
ఇప్పుడు జరిగే
విభజన ప్రక్రియ ఫలితం 
శాశ్వతం.


ప్రజాసామ్యం పై అత్యంత గౌరవంతో[?]
ఓటు వెయ్యకపోతే వుతారు ఇదవుతారు అనే మీడియా కూడా 
విభజన అంటే అదేదో ఉద్యోగులకి సంబంధించినదిగా చూస్తున్నదే కానీ,
ఈ విషయం మీద సరైన అవగాహనతో మెలగటం లేదు...
విభజన విషయాలపై సరిగా చర్చించటం లేదు...  
ఇది రాజకీయ నాయకుల-పార్టీల భవిష్యత్తు కాదు కదా...
ప్రజలది కదా... ఎవడికి పట్టింది....!!!


జై హింద్


బొమ్మలు గూగుల్-మిక్సింగ్ కేఆర్కే 



@@@@@<><><><><><><>@@@@@


రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:

లింకులు నొక్కండి



2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???




 17]సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం 

మరో హైదరాబాదు కాబోతున్నదా...???




@@@@@@@@@@@@


@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@



8, మే 2014, గురువారం

సరి లేరు మీకెవ్వరూ....


హమ్మయ్య. ఎన్నికలు అయిపొయినాయి. 
ఇంకొ అయిదేళ్ళ దాకా రావు. 
రాకూడదు కూడా... 
ప్రజా సేవ చెయ్యటానికి రాజకీయ నాయకులు 
పొటాపోటీగా ఎగబడి ఎన్నికలలో పాల్'కొన్నారు
ఇంతగా ప్రజా సేవ చెయ్యటానికి ఎగబడే రాజకీయ నాయకులని 
మరే దేశంలోనూ కూడా చూడలేము. 
ఆ మాటకొస్తె పురాణాలలో కూడా చూడలేదు. 
ఆహా ప్రజలంటే నాయకులకి ఎంత ప్రేమ...! 

ప్రజలకి సేవ చెయ్యటానికి తాము పుట్టి పెరిగిన రాజకీయ పార్టీలనే ఒదులుకుని త్యాగాలు చేశారు. కొత్త పార్టీలనే ఎంతో శ్రమకోర్చి కొంత మంది పెట్టారు.  అంత స్తోమత లేని వారు ఏ పార్టీలో  చేరితే గ్యారంటీగా గెలుస్తామో ఆ పార్టీలోనికి రానిచ్చినా, రానియ్యకపొయినా...బలవంతంగానైనా దూరి ప్రజలకి దగ్గరవ్వాలని మన నాయకులు చేసిన ప్రయత్నాన్ని మనం తప్పకుండా హర్షించి తీరాలిసిందే...

ఇక వారు గెలిచి ఆ ప్రాంతపు అభివృద్ధిలో భాగం పంచు' కోవటానికి{?} అప్పటిదాకా ఎవరిని తిట్టారో వారినే మెచ్చుకుని...ఎవరిని వెనకేసుకుని వచ్చారో వారినే ఎండగట్టి; తమలో తాము కుమ్ములాడుకుని అయినా సరే ప్రజా సేవయే తమ తక్షణ కర్తవ్యమని నమ్మినారు మన రాజకీయ నాయకులు. ఇంతే కాదు...తమ పార్టీలనే కాకుండా తమ సంపదని కూడా కొందరి ప్రజల కోసం త్యాగం చెయ్యటానికి వెనుదియ్యలేదు. "ఇలా సంపదని త్యాగం చేసిన వారిలో ఆంధ్రప్రదేశ్ నాయకులే ముందర ఉన్నారని ఎలక్షన్ కమీషన్ వారు కూడా ఎలక్షన్లు అయిపోగానే ప్రశంసా పత్రాన్ని ఇచ్చారు"...!!!

ప్రజల కోసం ఏమైనా చెయ్యటానికి వెనుదియ్యని మన రాజకీయ నాయకులు కౌన్సిలర్ దగ్గర నుండీ ఎంపీల వరకూ తమ స్తాయిని కూడా మర్చేపోయి ప్రజల కోసం తాము చెయ్యబొయ్యే అభివృద్ధి పనులకోసం వేలకోట్ల రూపాయలు ఎలాగైనా తెచ్చి అభివృద్ధి చేస్తామని మాటలు ఇచ్చేస్తున్నారు.  ఒకరు అర్ధ రూపాయకే కిలో బియ్యం ఇచ్చేస్తుంటే, ఇంకొకరు సింగప్పుర్ చెసేస్తామంటున్నారు... మరొకరు కేవలం వంద రూపాయలకే నెల కరెంటుని ఇచ్చేస్తామని చెపుతున్నారు.  ఇది అన్నిటికన్నా అద్భుతమైన విషయం. ఎందుకంటే వీరు ఒక్కో నియోజక వర్గానికి చెయ్యబొయ్యే అభివృద్ధి పనుల విలువ అనేక చిన్న దేశాల సంవత్సరం బడ్జెట్టు విలువ అంత ఉండటమే. ఇది మన రాజకీయ నాయకులకి కాక మరింకెవరికి సాధ్యం...!!! స్వంత ప్రజల మీద భారం వెయ్యకుండానే ఇంత డబ్బుని ఎక్కడి నుండీ తేస్తారో...బహుశా ఇతర దేశాల మీద దాడి చేస్తారేమో...ఈ డబ్బు కోసం.

ఇంతలాగా ప్రజల గురించి మాత్రమే ఆలోచించే వారు మరెక్కడైనా ఉంటారా...? కేవలం ప్రజల కోసమే తమ పరువు ప్రతిష్టలనే కాకుండా తమ మనస్సాక్షిని కూడా చంపుకుని ఇష్టం లేని వారితో కూడా చేతులు కలిపి ప్రజలకి సేవ చెయ్యటానికి ముందుకొచ్చారంటే మన రాజకీయ నాయకుల గొప్పతనం మరింకెవరికైనా ఉంటుందా...??  తామూ కనుక అధికారం లోనికి రాకపొతే తమ ప్రజలు ఏమైపొతారో అన్న ప్రేమతో కూడిన భయం వీరిలో ఉన్నట్లుగా...కన్న తల్లిదండ్రులలో కూడా కనపడదు.

ఇంతే కాదు వీరి గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉన్నది... కానీ, ఇంత త్యాగాలు ప్రజల కోసం చేసినా ఎందుకో వీరంటే ప్రజలలో చులకన భావం ఉన్నది. ఎందుకు ఇంత చులకన భావం...???? ఎన్నో త్యాగాలు చేసి అధికారంలోనికి వచ్చిన నాయకులు పెంచిన రవాణా చార్జీలనీ, కరెంటు చార్జీలనీ, నిత్యావసర ధరలనీ భరించి ప్రజలు కూడా త్యాగాలు చెయ్యాలని కోరి... తాము మాత్రం రాచరిక హోదాల్లో అన్నీ ఉచితంగా పొందటం వల్లనా...?? లేక, ప్రజలు నానా కష్టాలు పడి 30, 40 ఏళ్ళలో సంపాయించలేనంత సంపదని రాజకీయ నాయకులు కేవలం అయిదేళ్ళ ప్రజాసేవలో సంపాయిస్తున్నారనా...?

ఇంతమాత్రానికేనా, నాయకులు కేవలం తాము రావటమే కాదు...తమ వారైన కొడుకుల్నీ, కూతుళ్ళనీ, కొడళ్ళనీ, అళ్ళుళ్ళనీ... ఇలా ఒకరేమిటీ పెద్దవారి ఆత్మలతో సహా...కుటుంబాలకి కుటుంబాలే ప్రజాసేవ నిమిత్తం ఎండనకా... వాననకా రొడ్డున పడుతున్నప్పుడూ కొన్ని సౌకర్యాలని పొందితే ఏమిటటా...? సంపాదన మాటా; ఆ మాత్రం లేకపొతే వారికి రాజకీయ భవిష్యత్తు ఏముంటుంది.  ఇదేమన్నా నెలవారీ గ్యారంటీ ఉద్యోగమా 30 ఏళ్ళపాటూ నెల తిరిగేప్పటికి జీతం రావటానికి... అయిదేళ్ళు; అదీ కూడా గ్యారంటీ లేదు. ఆ తరవాత వాళ్ళ  పరిస్తితి ఏమిటో... "వారు అయిదేళ్ళలో సంపాయించిన విధానానికి...తిరిగి వారే అధికారంలోనికి రావటం తప్పనిసరి కదా...పులి మీద స్వారీ"... ప్రజల కోసం ఇంత చేస్తున్న మన నాయకులకి సరితూగగల వారు ఎవరన్నా ఉన్నారా... ?!?!?!?  


కొసమెరుపేమంటే, 
అధికారం కోసం నానా కష్టాలు పడినట్లుగా భావించిన నాయకులలో 
దేశం విడిచి వెళ్ళగలిగిన నాయకుడు 
దేశం విడిచి హాలిడే రిసార్టులకి వెళ్ళగా.... 
దేశం విడవటం కుదరని మరో నాయకుడు 
దేశీయ హాలిడే రిసార్టుకి వెళ్ళిపోయ్యాడు... 
కానీ, 
ఈ నాయకులు 
ఎన్నికల సందర్భంగా రగిల్చిన చిచ్చులో పడి
 ఆయా పార్టీల కార్యకర్తలు కొట్టుకుని చస్తున్నారు.
 వీరికి ఏ హాలిడే రిసార్టులు లేవు. 
ఇదే ప'రాజ సామ్యం..!!!!!!!!!
[11-5-14]





జై హింద్

బొమ్మ గూగుల్ ప్రసాదమే...మిక్సింగ్ కేఆర్కే 

30, మార్చి 2014, ఆదివారం

ఎన్నికల కోడు గురించి కోడై కూసే మీడియాకి మాత్రం ఏ కోడూ వర్తించదా...???

ఎన్నికల కోడ్ అందరికీ వర్తించదా...???

ఎన్నికలు వస్తున్నాయి అంటే చాలు 
ఎన్నికల కోడు కూస్తోందని మీడియాలలో ఒకటే గోల... 
ఎన్నికల కోడ్ అంటే...
ఎన్నికలు జరగబోయే ముందర 
నాయకులు రకరకాలైన పనులు చేసి ఓటర్లని ఆకట్టుకుంటున్నారనీ 
వారిని కట్టడి చెయ్యాలనీ పెట్టినదే ఎన్నికల కోడు...
దీని ప్రకారం ఎన్నికల సంఘం ఎన్నికలని ప్రకటించగానే 
ఎవరూ కూడా కొత్త పధకాలని ప్రవేశ పెట్టకూడదు... 
అలాగే అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రజలని మభ్య పెట్ట కూడదు... 
మతం, దేవుడు లాంటి పదాలు వాడి ప్రజలని లోబర్చుకో కూడదు...
 ఇలాంటివి అనేకం ఉన్నాయి... 
వీటి వలన ప్రజలు ప్రలోభాలకి లోను కాకుండా ఓటు వేసి 
తమ అసలైన మనోభావన్ని తెలియజేస్తారని 
ఈ కోడుయొక్క ఉద్దేశ్యం...

ఇన్ని ఉన్నప్పటికీ 
ఈ కోడు గురించి కోడై కూసే 
మీడియాకి మాత్రం ఏ కోడూ వర్తించదు 
ఎందుకనో...!!!
వీరు ఎన్నికల ముందు లాగానే... 
ఎన్నికల ప్రకటనానంతరం కూడా 
ప్రజలని ఉద్రేక పరచే, మభ్యపెట్టే అనేకమైన విషయాలని 
తమ మీడియా ద్వారా ఇష్టారాజ్యంగా ప్రసారం చేసి పారేస్తుంటారు... 
ఏమాత్రం సామాజిక బాధ్యత లేకుండా...

వీటిలో కొన్ని...

1] ఫలానా నియోజక వర్గంలో ఓ సామాజిక వర్గం బలంగా ఉన్నదని...

2] మరో నియోజక వర్గంలో మైనారిటీల ఓట్లే కీలకం అనీ... 

3] ఈ నియోజక వర్గం కాంగ్రెస్సు పార్టీకి పెట్టని కోట, మరొక దానిలో తెలుగు దేశం ఏమైనా గెలుస్తుందని, ఇంకొక దానిలో వైఎస్సార్ సీపీకి ఎవరు నుంచున్నా సరే గెలుపు ఖాయమని వివరణలని ఇచ్చేస్తుంటారు; ప్రజలు "వెయ్యబోయ్యే ఓట్లతో" సంబంధం లేకుండానే...

4] ఫలానా నియోజక వర్గం లోని ఒక ప్రాంతంలో డబ్బులు బాగా ఖర్చు పెట్టాలిసి వస్తుందని... అక్కడ డబ్బుదే హవా అనీ...

5] మీడియా విలేఖరి అనబడే వాడు తమ పేకాట భాషని వాడితూ... ఒక నాయకుడు తమ పార్టీ గెలుపుకై   "బీసీ కార్డు" ఉపయోగించాడని... 

6] ఫలానా నాయకుడి చూపు మరొక పార్టీ పై ఉన్నదని, చాటు మాటున ఆ పార్టీ వారికే సపొర్టు చేస్తున్నాడని...

7] అదృష్టం తలుపుతట్టి అనుకోని వాడికి పార్టీ టిక్కెట్టు వచ్చిందని...[ప్రజాసేవ అంటే లాటరి టిక్కెట్టు లాంటిదా..]

8] ఎంతో భాద్యతాయుతమైన వీరు వాడే భాష చూస్తే అసలు ఎన్నికల గురించా లేక ఏదైనా సినిమా గురించా అని అనిపించక మానదు... "రసకందయంలొ పడింది", "రసవత్తర పోరు",  "ఒంటరి పోరు", "ఓటు బ్యాంకు","కుల సమీకరణాలు/వర్గీకరణాలు", "ఎన్నికల సందడి"....


ఇలా ఒకటేమిటి, ఎలక్షన్లు ప్రశాంతంగా జరుగుతున్నా కూడా ...ఫలానా చోట పొలిసు కాపలా లేదని, అక్కడ ఏదైనా జరిగే అవకాశం ఉన్నదని...పరోక్షంగా రిగ్గింగు చేసేవారికి సందేశం ఇస్తూ....ఏదైతే ఎలక్షన్లలో ఓటర్లని ప్రభావితం చెస్తాయని భావించి ఎన్నికల కోడులో పెట్టారో... వాటికన్నా మించిన అంశాలని చాలా వివరంగా మీడియాలలో చర్చించి ఓటర్లని ప్రభావితం చేస్తున్నారు; హక్కులే కానీ బాధ్యతలు లేని మీడియా.  వీరిచ్చే గణాంకాల వలన ఆయా ప్రాంతాలలో అభివృద్ధికన్నా అల్లర్లు ప్రబలే అవకాశాలే ఎక్కువ. ఇంత కోడ్ ఉల్లంఘన చేస్తున్న వీరే, మరెవరో ఎన్నికల కోడును దాటుతున్నారని తెగ హడావిడి చేసి,  కొన్ని గంటల తరవాత మిన్నుకుండిపోతారు... 

"మీడియా వారు చేసే మానసిక కోడ్ ఉల్లంఘనకన్నా, రాజకీయ నాయకులు చేసే భౌతిక కోడ్ ఉల్లంఘనే నయం"....దాని వలన ప్రజలకి ఏదో పధకం ద్వారా డబ్బులో లేక అభివృద్ధి కార్యక్రమమో అందుతుంది.

కాబట్టి ఓ ఎన్నికల కమీషను వారూ... అందరికీ వర్తింపచేసిన ఈ ఎన్నికల కోడును, మీడియాని కూడా తమ పరిధిలోనికి తెచ్చుకొని, అన్నిరకాల మీడియాలకి కూడా వర్తించేట్లు చూడగలరు...  వాటిని మీరిన మీడియాకి డబ్బుల పెనాల్టీలతోబాటూ... ఎన్నికలు అయ్యేదాకా ఆ మీడియాపై బేన్ పెట్టే విధంగా చర్యలు తీసుకొవాలి....  

ఒక వేళ వీటిని కంట్రోల్ చేసే అధికారం లేనట్లయితే....కేబుల్ ఆపరేటర్ల మీద చర్యలు తీసుకొని, కోడు మీరిన మీడియా కనపడకుండా చేసి...ఎన్నికలలో ఓటర్లు తమ ఆలోచన ఏదో తాము చేసుకునే "ఆలోచనా స్వాతంత్రాన్ని" రక్షించగలరు. ముఖ్యంగా "పెద్ద మనుషులు కూర్చుని చర్చిస్తున్నట్లుగా కొట్టుకొనే ప్రోగ్రాంలను" ఎలక్షన్ల కాలంలో నిషేధించ వలసి ఉన్నది.



@@@@@@@@@@@@@@@@@@

****************************************************************
అందరికి ఉగాది శుభాకాంక్షలు
****************************************************************
@@@@@@@@@@@@@@@@@@




23, మార్చి 2014, ఆదివారం

మత చిచ్చు పెడుతున్న తిరుమల అవినీతి అగ్ని...

కర్టేసి:గూగుల్ ఇమేజెస్ 

కొద్ది రోజులుగా తిరుమలలో ఉన్న అడవులలో కార్‌చిచ్చు ప్రబలి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించినాయి... అవి ఆర్పడం గురించి కన్నా అవి ఎందుకు ప్రబలినాయో ఎవరికి తోచినట్లుగా వారు రకరకాలుగా వ్యాఖ్యానాలు చెప్పుకు పోతున్నారు... చివరకు ఎలాగైతేనే మన నేవీ వారి సహాయ సహకారాలవలన అవి చల్లారిపోతున్నాయి...

అయితే ఆ మంటలు చల్లారుతున్నా, అవి ఎందుకు ప్రబలినాయో అన్న అనుమానపు మంటలు చల్లారటం లేదు... ఈ విషయంలో మతం మాటను ఎవరు పైకి తెచ్చారో కానీ, ఎవరో అన్య మతస్తులు వలనే ఇది జరిగింది అని ఎక్కడో ఉన్న విశాఖ స్వామీజీ గారు కూడా అనేశారు. ఇది ఆయన తెలిసి అన్నారో లేదో తెలియదు కానీ... ఇదంతా చూస్తుంటే ఆ మంటలు కావాలని రాజేసినవే అని మడుకూ అర్ధం అవుతున్నది...

ఇవి అలా ఎవరు రాజేశారు అని అనగానే... అనుమానం సహజంగానే మతాలన[అ]మ్ముకొనే వారి మీదకే పోతాయి... కాని, ఈ విషయంలో ఇది ఇలాగే అనుమానం తేవాలనే, కొందరు పనిగట్టుకొని... అసలు విషయాన్ని జనానికి తెలియకుండా ఉంటానికే అలా ప్రచారం చేస్తున్నారా... అని అనిపించక మానదు...!!

ఈ అనుమానాలని ప్రక్కన పెట్టి, కొద్ది నెలలుగా జరిగే సంఘటనలని తీసుకుంటే ఈ మంటలకి కారణం ఎవరో ఇట్టే తెలిసిపోతుంది... అనేక ఏళ్ళుగా తిరుమల అటవీ సంపదని కొల్లగొడుతున్న చందన స్మగ్లర్లు; కొద్ది నెలలుగా బరితెగించి పోలీసుల మీదే తిరగబడటం, ఆ అడవి తమ స్వంతం అని అన్నట్లుగా పొగరు చూపించటం, దానికి తగ్గట్లుగా వీరికి రాజకీయ నాయకులలో కొందరి అండ ఉందనే వాదనలూ... ఇవన్నీ చూస్తుంటే ఈ దుస్సాహసానికి చందన స్మగ్లర్లూ, వారితో కలిసిన కొందరు రాజకీయ నాయకుల అండ ఉన్న అధికారులూ...కారణం అనిపిస్తోంది...

ఏదైనా ఆఫీసులలో అవినితి జరిగినప్పుడు సహజంగా ఆ ఆఫీసుకి అగ్ని గండం ఉంటుంది... ఆ ఆఫీసు ఎంత కాంక్రీటు బిల్డింగులో ఉన్నప్పటికీ, రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్నప్పటికీ, దేశ రాజధాని ఢిల్లీలో పేద్ద బిల్డింగులో ఉండి బ్రహ్మాణ్ణమైన కాపలా ఉన్నప్పటికీ అక్కడ అగ్ని ప్రమాదం జరిగి..."కాలాలిసిన ఫైళ్ళు కాలేదాకా" ఆ మంటలు అదుపులోనికి రావు పాపం...ఎన్నొ ఆధునిక ఫైరింజన్లు ఉన్నప్పటికీ..

ఏదైనా అడవిలో ఏ రకం చెట్లు ఎన్ని ఉన్నాయి లాంటి వివరాలు అటవీ శాఖ వారి వద్ద ఉంటాయి....ఆ ఫైళ్ళ నకళ్ళు రాజధానిలో ఉంటాయి... మరి ఇన్నాళ్ళూ జరిగిన చందనం, ఇతర వృక్షాల స్మగ్లింగు అవినీతిని చెరిపెయ్యటం ఎలా... పైన మనం చెప్పుకున్నట్లుగా దానికి సంబంధించిన ఆఫీసులో అగ్నిప్రమాదం జరిగితే పోలా...చాలా తేలికే మరి... అయితే ఇప్పుడున్న పరిస్తితులలో ఏ తిరుపతి ఆఫీసులో అగ్నిప్రమాదం జరిగితే కుదరదు కదా...హైదరాబాదులో కూడా దానికి ప్రతిస్పందన రావాలి కదా... కానీ అక్కడ ఉన్నది ఏ సాదాసీదా రాజకీయ నాయకుడో కాదు..."నారసిమ్హుడు". 

నారసిమ్హుడి ప్రతి స్పందన ఎలా ఉంటుందో దొంగ పెట్రోల్ బంకుల స్ట్రైకులో  చూశారు...కాబట్టి ఈ ఆఫీసు అగ్నిప్రమాదం కుదరదు...పొనీ ఎలక్షన్ల తరవాత చూసుకుందాము అంటే అప్పుడు రాజెవరో...__...ఎవరో తెలియదు కదా... ఎందుకొచ్చిన గొడవ, ఈ తిరుమల అడవుల అవినీతిని నానబెట్టటం ఎందుకు... ఆఫీసులో కాకపోతే అడవిలో అగ్నిప్రమాదం జరగదా... పైగా అది ఇంకా తేలిక కూడా... అని అవినీతి దోంగలు అనుకోవటం వల్లనే తిరుమలలో అవినీతి మంటలు చెలరేగినాయి... అప్పుడు రికార్డులుంటాయి కాని, అడవే ఉండదు కదా... లెక్కల్లో తేలని అడవి, అగ్నికి సమర్పయామి అని సర్ది చెప్పుకోవచ్చును కదా...!!!

తిరుమలకి భక్తిగా వచ్చే భక్తుల లింగ భేదం చూడకుండా... అందరి ఒళ్ళంతా తడిమి మరీ చెకింగు చేసి... వంటిమీద దుస్తులు తప్ప మంచి నీళ్ళ సీసాకూడా వదలకుండా అన్నీ ఊడగొట్టి మరీ పంపించే కట్టుదిట్టమైన భద్రత ఉన్న చోట  మంటలు చెలరేగినాయి...!!! ఎవరికీ పట్టలేదు...!!! ఎదో రెండిళ్ళు తగలడుతుంటే ఫైరింజనువాళ్ళు వచ్చి ఆర్పినట్లుగా ఆర్పితే ఆ మంటలు చల్లారుతాయా...? ఈ విషయం అక్కడ ఉన్న అధికారులకి తెలియదా...?? ఒక వేళ తెలిస్తే, ఎందుకు అన్ని రోజులు మిన్నుకుండిపోయ్యారు...??? రోజూ పేపర్లోనూ...టీవీల్లోనూ కొత్త న్యూసు క్రింద రావటానికా...?!? "కాలాలిసిన ఫైళ్ళు కాలిన తరవాత" అప్పుడు నేవీ వారి సహాయాన్ని నిదానంగా వారికి వినపడనంతగా అడిగారు...పాపం...నేవీ వారు ఆలస్యంగం వచ్చినా ఆ మంటలని చక్కగా అదుపులోనికి తీసుకొచ్చారు. ఇదే మొదటి రోజునే, ఆ మంటల తీవ్రతని కనిపెట్టి నేవీ వారి సహాయం తీసుకుని ఉన్నట్లైతే, అంతటి నష్టం జరిగేదా...??

ఇంతకీ విషయం చెప్పొచ్చేదేమంటే... తిరుమలలో అగ్నిని దారి మళ్ళీంచినది ఎవరో కానీ... చాలా తెలివిగా...సినిమాలోలాగా ఒకరు మర్డరు చేసి... "అప్పుడే గొడవ పెట్టుకుని వెళ్ళిన మరొక వ్యక్తి ఐడెంటిటీని, కావాలని పడేసినట్లుగా" ఆ అవినీతి అగ్నికి మతం రంగేసి దారి మళ్ళీంచారు...


దీనిని కనుక ఉపేక్షిస్తే, 
హైదరాబాదులో అధికార మార్పిడికోసం జరిగే 
మతకల్లోలాలు లాంటివి 
కేవలం తిరుపతిలోనే కాక 
రాష్ట్ర వ్యాప్తంగా అంటుకునే అవకాశం ఉన్నది...
కాబట్టి, 
ఈ తిరుమల అవినీతి మంటల వ్యవహారాన్ని 
తేలిగ్గా తీసిపారెయ్యక 
అత్యున్నత సంస్థచే విచారణ జరిపి, 
అసలైన దోషులని శిక్షించాలి... 
అప్పుడే ప్రజలలో ఉన్న అనవసర అపొహలు తొలగి 
మత చిచ్చులు రేగకుండా ఉంటాయి...



@@@@@@@@@@@


                                                         

7, మార్చి 2014, శుక్రవారం

సీమాంధ్రకు ముంచుకొస్తున్న అసలైన కష్టం...


ఈ కష్టం...  "సమైక్యం పేరుతొ అనైక్యంగా యుద్ధం చేసిన సీమాంధ్ర రాజకీయ నాయకుల వల్లన వచ్చేదే..."  రాష్ట్రం విడిపోవటం కన్నా మించిన కష్టం ఏమిటా అనా.... ఎదో ఒకటి రాష్ట్రం విడిపోయింది...దాని వల్లన సీమాంధ్రకి వచ్చిన పెద్ద కష్టం ఏమీ లేదు... నష్టం పూడ్చుకోదగినదే.... అయితే ఆ పూడ్చుకునే నష్టాన్ని పూడ్చేదేవారు...?? మళ్ళీ మన స్వార్ధ రాజకీయ నాయకులే కదా...వీరు ఎంత పనికిమాలినవారు అయినప్పటికీ...!!!   వీరి అనై[తికత్వం]క్యం వలన రాష్టం విడిపోయినా కూడా వీరికి బుద్ధి రాలేదు... కలిసికట్టుగా ఉండవలసిన సమయంలో ఎవరి పొయ్య వారు పెట్టుకొంటున్నారు...

ఇలా సీమాంధ్ర రాజకీయ'వేత్తలు ఉంటే..... అక్కడ తెలంగాణలో ఏక పార్టీ లేక ఏక నాయకత్వ పరిపాలన రాబోతోంది...తెలంగాణాని తెప్పించింది మేమంటే మేము అని ఎంతమంది చంకలు గుద్దుకున్నా... "ఆ క్రెడిట్ కేసీఆర్‌కి తప్ప మిగిలిన ఎవ్వరికీ పోదు"... పైగా తన ప్రాంతం కోసం  తన పార్టీని కాలుష్య సముద్రంలొ కలిపేయకుండానే ఉంచారు...ఇది తెలంగాణాకి ఎంతో మంచిది. ఇక కాంగ్రెస్సుకి... కేసీఆర్ అండలేకపోతేగానీ బ్రతకలేని పరిస్థితిని ఆ పార్టీ వారే కొని తెచ్చుకున్నారు.... ఇకపోతే ఇక్కడ బీజేపీది "దారిని పొయ్యే దానయ్య పరిస్థితే"... ఆస్తుల తగాదా పడుతున్నవారికి, ఓ దారిన పొయ్యే దానయ్య ఎంత సహాయం చేసినా కూడా... ఆ అస్తులలో వాడికి భాగం రాదు కదా...!!! ఇదే తెలంగాణాలో బీజేపీ పరిస్థితి...

సీమాంధ్ర అని చెప్పి, తెలంగాణా పరిణామాలని వ్రాస్తున్నాననా మీ సందేహం...   విడిపోయి అన్నదమ్ములు లాగా బ్రతుకుదాము అన్న వారు,  అప్పుడే పంపు తగాదాలూ...ప్రహరీ గోడ తగాదాలూ మొదలెట్టేశారు.  ఈ కాస్తకి... ఇచ్చి పుచ్చుకుందాం అని కూడా ఓర్వలేని వారు... అన్నదమ్ములులాగా ఎలా ఉంటారు...కేవలం బద్ద విరోధులు లాగానే బ్రతుకుతారు... రేపు సీమాంధ్ర వారికి వీరితోనే తప్పనిసరిగా కలిసి కాపురం చెయ్యవలసిన పరిస్థితి కాబట్టి... అక్కడి రాజకియ పరిస్తితి బట్టే సీమాంధ్రలోని అభివృద్ధి ఆధారపడి ఉంటుంది... ఎవరైనా విడాకులు తీసుకోవాలని అనుకున్నా... ఒక పరిస్థితిలో కనీసం ఒక సంవత్సరం కలిసి ఉండి...అప్పుడు తీసుకోమని అంటుంటారు... కానీ, సీమాంధ్రులు విడాకులు తీసుకొన్న తరవాత కూడా తప్పనిసరిగా 10 ఏళ్ళు కలిసి బ్రతకమని, బ్రిటీషు తెలివితేటలున్న రాజకీయ నాయకులు పెట్టేశారు. అందుకనే సీమాంధ్రకు తెలంగాణా రాజకీయం కావాలి... అలాగే తెలంగాణాకి సీమాంధ్ర రాజకీయం కావాలి...ఇరువైపులా సమర్ధ ఐకమత్య రాజకీయ  నాయకత్వం ఉన్నప్పుడే ఏ ప్రాంతానికి కూడా అన్యాయం జరుగదు...అదిగాని బాలెన్సు తప్పిందో...అంతే సంగతులు...

తెలంగాణాలో ఏకపార్టీ పరిపాలన రాబోతుండగా...సీమాంధ్రలో ఐకమత్యం  మరియూ  నీతి జాతి లేని రాజకీయ నాయకులు...కనీసం ద్వి పార్టీ కాకుండా కూడా చేసేశారు... ఎవరి దారి వారిదే.. ఎవరికి వారికి తమ రాజకీయ భవితవ్యం మీద ఆందోళనేగానీ... విడిపోయి, రాజధాని లేక అల్లల్లాడుతున్న సీమాంధ్ర గురించి ఎవరికీ పట్టటంలేదు... ఇలా కొట్టుకు చచ్చే పార్టీలు అనేకం ఉండటంతో సీమాంధ్రలో ఏ సంకీర్ణమో కనుక వస్తే... సీమాంధ్రకి తీరని నష్టం వస్తుంది...వీరి అనైకత్యంతో ... మళ్ళి ఐకమత్యంగా హైదరాబాదునే అభివృద్ధి చేస్తారు...వీరు ఇప్పటికీ సీమాంధ్ర అవసరాలు...కరెంటు తదితరాల పట్ల ఉదాసినంగా ఉండటానికి కారణం...హైదరాబాదులో ఉన్న వారి ఆస్తులు...పరిశ్రమలే....

ఇక విషయంలోనికి వస్తే, కొత్తగా విడిపోయిన తెలంగాణాలో బలమైన ఏకపార్టీ పరిపాలనతో వారు తమకి కావాలిసినవన్నీ సమకూర్చుకుంటారు...ఇది ఎన్నికల తరవాతే చెప్పనఖర్లేదు...ఇప్పటికే భద్రాచలం విషయంలో తేటతెల్లం అయ్యింది... తమది కాని భధ్రాచలాన్ని వీరు సాధించుకుంటుంటే... ఇప్పటికి కూడా తమ గొడవలే కానీ...తిరిగి ఆ పట్టణాన్ని అడుగుదాము...అక్కడి ప్రజలని ఆకట్టుకుందామన్న జ్ఞానం లేని రాజకియ నాయకులతో సీమాంధ్ర నిండి ఉన్నది...కేవలం ఒక్క పట్టణాన్ని కూడా సాధించుకోలేని... ఇలాంటి అసమర్ధ-స్వార్ధ-పనికిమాలిన నాయకులతో సీమాంధ్ర ఉన్నది...ఇది రాబోయే అయిదేళ్ళ పాలనలో కూడా కనపడుతుంది... సీమాంధ్రకి భవిష్యత్తు పునాదికి కావాలిసింది కూడా రాబోయ్యే అయిదేళ్ళ పాలనే... ఆ అయిదేళ్ళ పాలన కూడా సీమాంధ్ర మూర్ఖ-స్వార్ధ పాలకులతోనే గడచిపోతే,  ఇక సీమాంధ్ర కోలుకోవటం ఇప్పట్లో సాధ్యపడదు...

కాబట్టి, సీమాంధ్ర రాజకీయ నాయకులారా... 
ఇప్పటికైనా ఇక్కడి అన్ని పార్టీలు కలసి 
సీమాంధ్రకి కావాలిసినవి సాధించేట్లుగా 
ఒక కూటమిగా ఏర్పడి...
ఒకరినొకరు తిట్టుకోవటం మాని...
ఏక నాయకత్వం క్రిందకి తప్పనిసరిగా వచ్చేట్లుగా నిర్ణయం తిసుకోండి... 
మీ స్వార్ధ రాజకీయ భవిష్యత్తుని గురించి ఆలోచించటం మానండి... 
సీమాంధ్రుల కష్టం తిరిగి ఏ మదరాసులోనో, హైదరాబాదులోనో
 లేక ఏ మురికి గుంటలోనో పడిపోకుండా 
చూసుకొనే విధంగా రాజకీయాలు నడిపి, 
సీమాంధ్ర ప్రజలలో నమ్మకాన్ని పెంపొందించండీ... 
సీమాంధ్రులకి కావాలిసింది డబ్బులో లేక పేకేజీలో కావు... 
వీరికి అవ్వి సంపాయించే తెలివితేటలు చదువూ అన్నీ ఉన్నాయి... 
లేనిదల్లా ఆత్మ విశ్వాసమే... 
దానిని పొగొట్టింది కూడా మీరే...

ఇకపోతే హైదరాబాదు మీడియా...
సీమాంధ్రుల ఆత్మవిశ్వాసం పోగొట్టటంలో ప్రముఖ పాత్రని పోషించింది...
కాబట్టి,
 సీమాంధ్ర బాగుపడాలంటే 
హైదరాబాదులో ఏ గూడాలోనో కురిసిన భారి వర్షాన్ని 
రాష్ట్ర వ్యాప్తంగా  లైవ్ చేసే 
భావిలో కప్పలైన హైదరాబాదు మీడియా కాదు...
"స్వంతంగా సీమాంధ్ర ప్రాంతంలో నుండీ వచ్చే సీమాంధ్ర మీడియా కావాలి"...
ఈ మీడియా మాత్రమే 
సీమాంధ్రుల మనోభావాలని ప్రతిబింబించి, వాటికి గౌరవం పెంచుతుంది...
ఇది ఖచ్చితంగా జరగాలిసినదే...
ఎందుకంటే,
ట్రాయ్ కధలో గుర్రం బొమ్మతో గ్రీకు వారు మోసం చేసినట్లుగా...
 తమ వార్తలు, డైలీ సిరియల్సుతో
దిక్కుమాలిన హైదరాబాదు మీడియాలు
సీమాంధ్రులను మోసం చేస్తున్నాయి...చేస్తాయి.

సీమాంధ్ర ప్రజలూ తస్మాత్ జాగ్రత్త...!!!
"పొత్తులు అంటూ రాజకీయ వెర్రిని, 
 డైలీ సీరియల్స్, రియాలిటి షోలు అంటూ సుత్తులని కొట్టే "
హైదరాబాదు పిచ్చి మీడియాని వదిలించుకోండి...!!!



జై హింద్




రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి


2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???