LOCAL WEATHER

24, ఫిబ్రవరి 2014, సోమవారం

సీమాంధ్రలో రాజధాని ఎక్కడ పెట్టకూడదు...?!?!?

ఇదేమిటీ, రాజధాని ఎక్కడ పెట్టాలీ అని అందరు తలలు బాదుకునే పరిస్థితులు వస్తుంటే "ఎక్కడ పెట్టకూడదు" అని వ్రాయటమేమిటా అనా సందేహం...

రాజధాని ఎక్కడ పెట్టాలి...ఎలా పెట్టాలి...దానికి కావాలిసినవి ఏమిటీ...అని ఇంతకు ముందే ఈ బ్లాగులో  9 ఆగస్టు 2013 న వ్రాయటం జరిగింది....[లింకు నొక్కండి:ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???] అలా  దీని ప్రకారం పెట్టాలంటే మనవారికి చాలా విశాల హృదయంకావాలి...కానీ, ఇప్పుడు జరుగుతున్నా పరిస్తితులు చూస్తుంటే "సమైక్య ఉద్యమ్మాన్ని నడిపిన రాజకీయ వేత్తలకి" ఇంత కాకపోయినా...కొద్దిగా అయినా విశాలమైన ఆలోచన ఉందా అని అనిపిస్తోంది...

ఆగస్టు 2013 మొదటి వారం తరవాత, ఎన్నో నాటకీయ పరిణామాలు జరిగినాయి... మద్రాసు విభజన జరిగిన సమయంలో లేని వాళ్లకి..అది ఎలా జరిగింది...అప్పుడు మనవాళ్ళు ఎలా ప్రవర్తించారు...అనే విశేషాలని మనవాళ్ళు ప్రత్యేక్ష ప్రసారం చేసి మరీ చూపించారు...అప్పట్లో టీవీలు..విపరీత మీడియాలు లేకపోవటంతో... జనంలో జరిగిన పోరాటాలే తెలిసినాయి కానీ, తెర వెనుక జరిగిన కుళ్ళు రాజకీయ కంపు తెలియలేదు... కానీ, ఇప్పుడు ఆ కొరత లేదు కదా...అన్నం తిన్న తరవాత మధ్యలో ఎన్ని తిరుగుళ్ళు తిరిగి అది క్రిందకి ఎలా వస్తుందో ప్రత్యేక్షంగా చూపించే [ఇది చూపించ వచ్చు...చూపించకూడదు అనే విచక్షణ లేని] మీడియాలు...  రాజకీయ కుళ్ళు మొత్తం చూపించేసినాయి. అప్పట్లోలాగానే యధావిధిగా సీమాంధ్ర రాజకీయ వేత్తలు మరో మాయ... సమైక్యాంధ్ర పేరుతొ హైదరాబాదు గొడవలో పడి తమకు కొత్తగా రావాలిసిన వాటి మాట అటుంచి...1956కు ముందున్నవి కూడా పోగొట్టుకొని వీరవిజయులై కొత్త హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటులో తమ వంతు కృషి తాము చేశారు....

ఈ కృషిలో ఎక్కువ భాగం పాలు పంచుకున్నది...అంతిమ ముఖ్య మంత్రి గారే..."హైదరాబాదులో తాను తిన్న ఉప్పుకి గౌరవం ఇచ్చారు". అలాగే మరొకరు... మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్లుగా....తన ప్రాణాలని హైదరాబాదులో పెట్టి... మా విజయవాడకి ఎందుకు పనికి రాకపోయినా, ఏదో స్వాతంత్ర యోధుడిగా తనకు తానే ముద్ర వేసుకొని...తన నాటకాన్ని తానే పండించి, చివరకు సన్నాసి అయినట్లుగా... మొఖం చాటేశాడు. ఇక ముఖ్యంగా మూడో వారిగా ఉన్న సీమాంధ్ర పంచ కట్టిన పెద్ద మనుషులు... "విభజన పాపం జరిగినప్పుడు అక్కడకి మమ్మల్ని రానియ్యలేదు" అని జనాలకి చెప్పుకోవటానికి, తమ కాపి స్లిప్పుని తామే అందించి... తమకితామే పరిక్ష నుండి డిబారు అయిపోయినట్లుగా నటించారు...ఇలా ఎవరి నాటకం వారు ఆడి జనాలతో ఆడుకున్నారు...


ఇదంతా ఎందుకు అంటే...ఇప్పుడు ఇలా అనవసర గొడవలు జరిగి, రెండు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగిన తరవాత విభజన జరిగేకంటే...మొదటి ప్రకటన జూలై 31 వచ్చినప్పుడే...సరైన పద్ధతిలో చేసినట్లయితే బాగుండేది కదా...ఇలా పనికి మాలిన నాటకాలు ఎవరి కోసం... పోనీ, ఇన్ని నాటకాల తరవాత అయినా సీమాంధ్రకి, న్యాయం మాట అటుంచి, కనీసం 1956కి ముందు రూపం వచ్చిందా అంటే అదీ రాలేదు. ఈ సారి విభజనలో భద్రాచలంతో పాటు కొన్ని ఊళ్ళని ఊడగోట్టించుకొన్నారు...ఈ విషయాన్ని ఇదే బ్లాగులో ఇంతకు ముందే 9 ఆగస్టు 2013 న హెచ్చరించటం జరిగింది...[లింకు నొక్కండి:ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???] ఇందులోని విషయం:                                      

"ఇది ఆంధ్రా వారికి అడిగే సమయం. కావాలిసింది కఠినంగా అడిగి, వత్తిడి చేసి తీసుకోవలిసిన టైమిదే...ఒకప్పుడు ఆంద్రా ఏర్పడేప్పుడు... మదరాసు మాయలో పడి, ఆంధ్రాలో కలవవలసిన చిన్న చిన్న ఊళ్ళ దగ్గర నుండీ జిల్లాల వరకు, ప్రక్క రాష్ట్రాల వారికి  నీళ్ళొదులుకున్నారు.... ఇప్పుడు కూడా హైదరాబాదు మాయలో పడి... రాష్ట్రానికి చెందిన అనేక ఊళ్ళ దగ్గర నుండీ, నీరు, వనరుల పంపిణీ ...ముఖ్యమైన ఆదాయ-వ్యయ లెక్కల్ని విస్మరిస్తున్నారు.  ఏది జరిగినా విభజన సమయలోనే జరగాలి... ఆతరవాత ఎంత మొత్తుకున్నా అది అరణ్య రోదనే...ఈ సంగతి గుర్తెరిగి బుద్ధి కలిగి ఉంటే మంచిది. ."

మామూలుగా ఉన్న మనలాంటి వారికే తెలుస్తుంటే....రాజకీయాల్లో పండిపోయి ఉన్న ఈ పనికి మాలినవారికి తెలియదా...??? నిన్నో మొన్నో కొందరు సీమాంధ్ర రాజకీయ  పెద్దలు "సమైక్య ఆంద్ర మాయలో పడి, రావాలిసినవి సరిగా అడగలేకపోయ్యామని" వాపోయ్యారు ట...ఇప్పుడు ఏమి ఏడిస్తే ఏం లాభం...!

ఈ ఏడుపుల వెనుక రకరకాలైన బెయిళ్ళూ...విడుదల బేరసారాలు కూడా బాగానే జరిగినాయి...ఒకరు ఆంధ్రాలో విడుదల అయితే, మరొకరు చిన్నమ్మగారి శిష్యుడు కన్నడంలో విడుదల అయినారు... అయితే, ఇప్పటి రాజకీయ నాయకులు కూడా 1953/56లలో రాజకీయనాయకుల కన్నా కొత్తగా ద్రోహం చేసిందేమీలేదనుకోండి...అప్పుడు ముఖ్యమంత్రి పదవికోసం ఒక పేద్ద నాయకుడు...బళ్ళారి, రాయచూరు జిల్లాలని వదిలివేస్తే, ఇప్పుడు తాము చేసిన తప్పిదనాలనుండీ బయటపడటానికి రాష్ట్ర ప్రయోజనాలని ఫణంగా పెట్టారు.                                 
సరే, అసలు విషయానికి వస్తే...ఇంత జరిగినా ఇప్పటికైనా వీరికి బుద్ధి వచ్చిందా అంటే... రాలేదనే అనిపిస్తోంది... ఇది "రాజధాని మా ప్రాంతంలోనే పెట్టాలి అని మన లోకల్ సమైక్య రాజకీయ నాయకులు డిమాండులు చూస్తే తెలుస్తుంది... ఎక్కడ పెట్ట కూడదు అని అనుకుంటామో, అక్కడే పెట్టాలని వీరు... "ఊరు భక్తిని" చూపిస్తున్నారు... ఇన్నాళ్ళు సమైక్యాధ్రకి ఉద్యమం చేసిన వీరి విశాల హృదయం విశాల రాష్ట్రం నుండి...తమ ప్రాంతం...అక్కడి నుండి తమ జిల్లా...అక్కడి నుండి తమ ఊరు దాకా ఎందుకనో కుంచించుకొని పోయింది... కాబట్టి, ఇప్పటికైనా  సమైక్యాంద్ర స్పూర్తిని కలిగి...ఎక్కడ పెడితే రాష్ట్రం మొత్తానికి, మరియూ పెట్టిన చోట లాభం ఉంటుందో అక్కడ పెడితే బాగుంటుంది. ఇక వీరు సూచిస్తున్న ప్రాంతాలలో ఎందుకు పెట్టకూడదో చూద్దాం...

1] విశాఖపట్టణం...ఇక్కడ పెట్టాలని ఆటే గొడవల్లో పాల్గొనని అక్కడి ఓ పెద్ద మనిషి రాజకీయ వేత్త అంటాడు...అక్కడ పెట్టటానికి అన్ని వసతులు ఉన్నాయట....  "మీ ప్రాంతాన్ని రాజధాని పేరుతొ అభివృద్ధి పరచుకొండిరా" అని వేల కోట్ల రూపాయలు ఇస్తామని కేంద్రం అంటుంటే... అంత డబ్బు మాకు అవసరం లేదు అని...ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతంలో రాజధాని కట్టమని అడగటంలో ఆయనగారి రాజకీయ అనుభవేమిటో మనకి అర్ధంకాదు...ఒక ప్రాంతీయ దురభిమానం తప్ప. మరొక విషయం ఏమిటంటే...ఈ విశాఖ పట్టణం మిగిలిన తెలుగు వారికి దూరం, ఒరియా వారికి దగ్గర. ఇక్కడగాని రాజధాని పేరుతొ వందల కిలోమీటర్లు అభివృద్ధి చెందితే...అందులో తెలుగువారికన్నా ఒరియా/హిందీ వారికే లాభం ఎక్కువగా ఉంటుంది....మూడవది ముఖ్యమైనది ఏమంటే..."ఇక్కడి ప్రజలకి కూడా హైదరాబాదు జనం లాగే బయట ప్రజలని భరించే శక్తి తక్కువ...కొన్నాళ్ళకి పొమ్మన్నా పొమ్మంటారు"....

2] కర్నూలు...ఇక్కడ అంతకు ముందే వుండేది అనీ, అందుకని అక్కడే పెట్టాలి అనీ... కొందరు సీమా రాజకీయాలలో పండిపోయ్యామని అనుకున్నవారు అంటున్నారు... అసలు ముందర అక్కడ పెట్టటమే తప్పు...మరల ఆ తప్పుని చెయ్యాలా...??? అక్కడ పెట్టటం వల్లనే హైదరాబాదు కలసిన తరవాత, రాజధాని అక్కడికి తరలిపోయింది. అదీకాక, నది దాటితే వేరొక రాష్ట్రం...అక్కడ పరిస్తితులు కూడా బాగున్నవి కావు...దాంతో అక్కడి ప్రజలు వెల్లువలా ఈ రాజధాని మీదకి దండెత్తే అవకాశం ఉన్నది. ఊరు పెరిగితే...పెరగటానికి వీలు లేకుండా నది ప్రక్కనే వేరొక రాష్ట్రం... దీనివల్లన నదికి అవతల ప్రక్కన పెరిగినా...ఆ ప్రాంతంల్లో సీమాంధ్రుల ప్రయోజనాలు ఏమీ ఉండవు...ఇలా మరొకసారి సీమాంధ్రుల కష్టం నదిలో కలిసిపోతుంది...       

3] విజయవాడ...[ఏలూరు నుండి గుంటూరు దాకా]"ఈ ఊరు అన్నిటికి చాలా బాగుంటుంది కదా" అని అనుకుంటున్నారా....ఇక్కడ ఉన్నంత కుళ్ళు కుల రాజకీయాలు మరెక్కడా ఉండవు... చివరికి విజయవాడకి లాభం చేకూర్చే విషయాలలో కూడా వీరు కొట్టుకుని, అది వేరొకరికి పోయ్యేట్లుగా చేస్తారుగానీ, ఆ పనిని మడుకు సక్రమంగా జరగనియ్యారు... ఇక్కడి రాజకీయ నాయకులే సరైన వారైనట్లయితే...మద్రాసు నుండి విడిపోయినప్పుడే ఇక్కడ రాజధాని ఏర్పాటులో కృషి చేసి ఉండాలిసింది... కానీ, అలా జరగలేదు. వీరికి పదవులిచ్చి, వాటితో పాటు ఇక్కడకి వచ్చే ప్రాజెక్టుల కాంట్రాక్టులు వీరికే కనుక ఇస్తే... తమ లాభం కోసం ఆ ప్రాజెక్ట్లులని మరో రాష్ట్రంలో కట్టటానికైనా వెనుదియ్యారు...ఇది ఇక్కడి రాజకీయ నాయకుల "విశాల హృదయం".    రేపు ఇక్కడ రాజధాని పెడితే, ఇక్కడికి వచ్చే ప్రాజెక్టులని పరాయి రాష్ట్రాలకి తాకేట్టేసెంత గొప్ప రాజకీయ వేత్తలున్నారు... మరొకటి, సీమాంధ్ర రాజధానిని ఇక్కడ పెట్టకుండా ఎక్కడ పెట్టినా కూడా తనంత తాను బాగుపడటానికి అవకాశం ఉన్న ప్రాంతంలో ఉన్నది... కాబట్టి, ఇక్కడ రాజధాని పెట్టి మరీ తొయ్యవలసిన పనిలేదు...రాజధానిగా లేకపోతేనే రాజకీయాలకి దూరంగా ఉండటం వలన తొందరగా మరింత అభివృద్ధి చెందుతుంది....                               

ఇప్పుడు చర్చలో ఉన్న ఈ మూడు నగరాల పరిస్థితి ఇలా ఉన్నది... కాబట్టి, నిజాయతీగా, కేంద్రం కనుక వేలకోట్లు మన కొత్త రాజధాని  కోసం ఇస్తే...వాటిని పూర్తిగా ఖర్చుపెట్టటానికి వీలున్న ప్రదేశంలోనే రాజధానిని పెట్టాలే కానీ, ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలలో పెట్టి...ఆ ఊళ్ళని డిస్ట్రబ్  చెయ్యటం మంచిది కాదు. అలాగే ఇప్పుడున్న పరిస్థితులలో మన రాజధానిని ప్రక్క రాష్ట్రం వారికి ఉపయోగ పడేంత దగ్గర ఉంచటం కూడా సరైన పద్దతి కాదు...                     

అందువల్ల...సీమాంధ్రలోని ఆంధ్రలో  రాజధాని పెట్టాలంటే ప్రకాశం జిల్లాలోనూ, సీమలో పెట్టాలంటే కడప జిల్లాలో పెట్టినట్లయితే, కేంద్ర నిధులు అన్నీ ఉపయోగించే వీలు ఉన్నది... ఇతర రాష్ట్రాల దాడి ఉండదు...ఇక్కడ కొద్దిగా లోకల్ రాజకీయాలు ఉన్నప్పటికీ...బయట నుండి వచ్చి పడే వారిని నిర్దేశించే శక్తి లేనివే కాబట్టి ప్రమాదం లేదు...


సీమాంధ్ర దేశం  ....కర్టేసి ఫేస్ బుక్  

రాజకీయ పెద్దలారా ప్రజలు 
మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఇప్పటికే నాశనం చేసేశారు...
ఇల్లు తగలడుతుంటే...
మీరు అంటించారు అంటే... మీరు అంటించారు అని గొడవలు పడి...
ఇల్లు తగలడే వరకు కొట్టుకున్నారు...
మీ పరస్పర ఆరోపణలని చూస్తుంటే 
జనాలకి అసహ్యం పుడుతోంది...

సీమాంద్ర జెండా ట... కర్టేసి ఫేస్ బుక్ 

ఇప్పుడున్న వాతావరణంలో... మరోసారి రాయల సీమ, ఆంధ్రలోని ఏ ప్రాంతం వారికైనా  పెట్టె బేడా సర్దుకోనే పరిస్థితి వస్తే 
అది ఉగ్రవాదానికి తెరతియ్యవచ్చును...
ఇప్పటికే పార్లమెంటులో వివక్షతకి గురైయ్యాము అన్న బాధతో 
 ఫేస్ బుక్ లో  
సీమాంధ్ర దేశం, దానికి జెండాని కూడా తయారు చేసేశారు 
మన యువత...
"ఇది ఇప్పటికి జోక్ గా తేలిగ్గా తీసిపారేసినా, 
తరవాత కాలంలో పశ్చాత్తాప పడవలసి ఉంటుంది"... 




రాజకీయ నాయకులారా కనీసం....ఇప్పటికైనా మీ రాజకీయాల గురించి కాకుండా, 
మిగిలిన రాష్ట్రం మరియు ప్రజల యొక్క అబివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, కలిసికట్టుగా పనిచేసి... 
తిరిగి ప్రజలలో నమ్మకాన్ని పెంచుకుంటే మంచిది..., 
లేకపోతే "మీ వంశపారంపర ఉద్యోగాలు అంతరించి పోతాయి"....!!! 



జైహింద్





రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి


2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి