LOCAL WEATHER

15, సెప్టెంబర్ 2012, శనివారం

రోజుకి Rs. 560 కోట్లు నష్టమా......నమ్మే మాటలేనా ....???





మధ్యకాలంలో అక్కడ నష్టమూ, ఇక్కడ నష్టమూ అని ప్రభుత్వం - ప్రభుత్వరంగ సంస్థలూ ఏదో వ్యాపార సంస్థలులాగా మాటలాడటం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే, ప్రభుత్వాలు - ప్రభుత్వరంగ సంస్థలూ బ్రతికేదే ప్రజల సొమ్ము మీద......, వీరు అమ్మేదీ అదే ప్రజలకి!!!! వ్యవహారంలో నష్టపోవటమనేది ఎక్కడ...? అసలు, వ్యాపార సంస్థ అయినా రోజుకి ఇన్ని కోట్ల నష్టంతో నడిస్తే అవి మనగలుగుతాయా....? కానీ మన ప్రభుత్వ రంగ సంస్థలు  వాళ్ళకి కావాలిసినవి వారు పొందుతూ అలా నడుస్తూనే ఉన్నాయి కదా....వీటికి డబ్బెక్కడి నుండీ వస్తోందీ...? ప్రభుత్వం నుండీ వచ్చే సబ్సిడీల ద్వారానే కదా....మరి తాము పొందే సబ్సిడీలను ప్రజలకి మళ్ళించద్దంటే దానిని ఏమంటారు....??

సబ్సిడీలు అనేదేదో భయంకరమైన మాటగా వాడుతున్నారు. సబ్సిడీల ద్వారా ప్రజలకి అందించబడే సొమ్ము ఎవరిదీ....ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులదా...? గంభీరంగా[నటిస్తూ] మొహాలు పెట్టుకొని ప్రజల సొమ్ముతో బోలెడు జీతాలు కొట్టేసే పేద్ద అధికారులదా...? లేక ఎవరి జేబులో నుండైనా తీసి పెట్టే వ్యక్తిగత సొమ్మా....? ఇవేమీ కాదు. డబ్బు కూడా ఏక మొత్తంగా ప్రజల జేబుల్లో నుండి రకరకాలుగా టాక్సుల పేరుతో సంపాయించినదే కదా...!!! సొమ్ములో నుండి కొంత సొమ్మును ప్రజల నిత్యావసరాలైన కొన్ని వస్తువుల ధరలు నియంత్రించటానికి వాడబడుతున్నదే కదా "సబ్సిడీ" అనే మాట. అంటే ప్రజల నుండీ అధిక మొత్తంలో వసూలు చేసి, దానిలో నుండి కొద్ది సొమ్మును తిరిగి ప్రజల అవసరాలకి ఖర్చు పెట్టటం ప్రభుత్వానికి నష్టమా...?

దేశంలోని ప్రజలందరూ ఒకే రకమైన సంపాదనతో ఉండటం అనేది జరగదు...ఎక్కువ సంపాయించిన వారు ఎక్కువ సౌకర్యాలను పొందుతారు, తక్కువ సంపాయించిన వారు దానికి తగ్గట్లు బ్రతుకుతారు....కానీ, వీరందరికీ కావాలిసిన కనీస సౌకర్యం తిండీ, బ్రతుకుతెరువు కోసం తిరగటం అనేది ముఖ్యమైనవి...వీటి కోసం ప్రజలను విభజించటం పద్ధతి కాదు కనుక, వీటిని బీద బిక్కీ తేడా లేకుండా అందరికీ ఒకే సరాసరి తగ్గింపు ధరలకి ఇవ్వటానికే సబ్సిడీ అని ఇచ్చి, మరొక రంగం వైపునుండీ వచ్చిన డబ్బును నిత్యావసరాలకి వాడుతున్నారు. డబ్బు ఎక్కడి నుండీ వచ్చినా అదీ ప్రజల డబ్బే.....అంతే గానీ ఎవరి జేబులోనుండీ వచ్చినది కాదు.

ఇంతకీ విచిత్రం ఏమంటే, నష్టాలు, సబ్సిడీలూ అంటూ మాట్లాడే వారు ఎవరూ...? వారి వారి ఏసీ రూముల్లో నుండి బయటకు రాకుండానే, బట్టలు నలగ కుండానే, ప్రభుత్వం ఇచ్చే ఉచిత సౌకర్యాలను[ప్రజల సొమ్ముతో] ఏమాత్రం సిగ్గు పడకుండానే వాడుకుంటూ మాటలాడుతున్న పేద్ద పేద్ద ఉద్యోగులూనూ, పేద్ద ప్రజా నాయకులూనూ.... ప్రజల సొమ్ముతో వ్యాపారం చేస్తూ, ప్రజలకే అమ్ముతూ, వాటిల్లో వచ్చే హెచ్చు తగ్గులను ప్రజల సొమ్ముతోనే సరిచేసుకుంటూ....... నష్టాలూ, సబ్సిడీలు వద్దూ అని తల్లడిల్లిపోయేవారు ప్రజా నాయకులవుతారా...? ప్రజా సేవకులవుతారా...? వీరిని ప్రజాప్రభుత్వ సేవకులూ, నాయకులూ అనాలా లేక కార్పోరేటు కంపనీల చైర్మన్లు అనాలా.....??? ఒక్కో కంపనీ కార్పొరేట్ లెవెల్లో ఏసీ ఆఫీసులూ, ఏసీ కార్లూ, లక్షలలో జీతాలూ, అనేక స్వంత సౌకర్యాలూ....వీటిల్లో మాత్రం లోటూ రాకూడదు మరి.

ప్రజలకి ఏదన్న చెప్పాలంటే ముందరగా, ప్రభుత్వం మరియూ పబ్లిక్ వ్యాపార సంస్థలూ కొన్ని త్యాగాలు చేసి చూపించి, తరవాత ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అంటే తమ డాంబిక, రాజరికమైనటువంటివి వదలి, మామూలు ఆఫీసులూ, అవసరమైనంత వరకూ తక్కువ సౌకర్యాలను పొంది, ఖర్చులు తగ్గించి, అప్పటికి కూడా ఇంకా మార్పు కావాలంటే ప్రజలకి అప్పుడు చెపితే బాగుంటుంది.......                                     

ఇందులోని బొమ్మలన్నీ గూల్‌వే....మిక్సింగ్ కె ఆర్ కె  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి